<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress.com" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>

<channel>
	<title>paramarthasatyam &amp;laquo; WordPress.com Tag Feed</title>
	<link>http://wordpress.com/tag/paramarthasatyam/</link>
	<description>Feed of posts on WordPress.com tagged "paramarthasatyam"</description>
	<pubDate>Sun, 20 Jul 2008 02:00:55 +0000</pubDate>

	<generator>http://wordpress.com/tags/</generator>
	<language>en</language>

<item>
<title><![CDATA[ప్రజా ప్రయోజనాలా? స్వార్థమా?]]></title>
<link>http://kadalitaraga.wordpress.com/?p=127</link>
<pubDate>Thu, 17 Jul 2008 19:38:06 +0000</pubDate>
<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
<guid>http://kadalitaraga.wordpress.com/?p=127</guid>
<description><![CDATA[అణుఒప్పందం వ్యవహారం చిలికి చిలికి గా]]></description>
<content:encoded><![CDATA[<p>అణుఒప్పందం వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయి లోక్ సభలో అవిశ్వాస తీర్మానం దగ్గరికి వచ్చింది. ఈ రసవత్తర నాటకంలో గుర్తించవలసిన, ఆలోచించవలసిన అంశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రభుత్వపక్షాల వైఖరి దగ్గరి నుంచి అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాల వరకూ, పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత ప్రవర్తన వరకూ ఎన్నో అంశాలు వివరంగా చర్చించవలసి ఉన్నాయి.<br />
<!--more--><br />
నిజానికి పార్లమెంటులో “ప్రజాప్రతినిధుల” విశ్వాసంతోనూ అవిశ్వాసంతోనూ ఏమీ సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి, దేశాన్ని తెగనమ్మడానికి, దేశ ప్రజల ప్రయోజనాలకు పూర్తిగా భంగకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సకల అవకాశాలూ ఉన్నాయి. ఈ అరవై సంవత్సరాలుగా కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారం చలాయించిన అన్ని రాజకీయ పక్షాలకూ అటువంటి చరిత్ర ఉంది. తన పదమూడురోజుల పదవీ కాలంలోనూ, పదమూడు నెలల పదవీకాలంలోనూ ఎటువంటి ప్రజావ్యతిరేక విధానాల నిర్ణయ పత్రాల మీద సంతకాలు పెట్టారో భారతీయ జనతాపార్టీ అధినాయకులు అటల్ బిహారీ వాజపాయి కి తెలుసు. పి వి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీ ప్రభుత్వంగా ఉండి కూడ ఎటువంటి దీర్ఘకాలిక ప్రభావం వేయగల, దేశప్రయోజనాలను బలిపెట్టగల నిర్ణయాలు తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. పార్లమెంటులో అత్యధిక సభ్యుల విశ్వాసం లేకుండానే అధికారపక్షాలు ఎన్నో కీలకమైన, లోతయిన, దీర్ఘకాలికమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది. </p>
<p>కనుక అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల ప్రజాప్రతినిధులనబడేవారిలో విశ్వాసం ఉన్నదా అవిశ్వాసం ఉన్నదా అనేది చర్చ కానేకాదు. ప్రభుత్వాలు తమకు ఐదు సవత్సరాల కొరకో, అంతకన్న తక్కువ కాలానికో అందిన అధికారాలను, ప్రజలు తమకు ఇచ్చిన అధికారాలను ఎట్లా వాడుకుంటున్నాయనేది, ఆ వాడుకోవడంలో వ్యక్తిగత ప్రయోజనాలున్నాయా, ఆ రాజకీయ పక్ష ప్రయోజనాలున్నాయా, దేశ ప్రయోజనాలున్నాయా అనేది చర్చ కావాలి. దేశ ప్రయోజనాలు అనే మాటను కూడ ఎవరికి తోచినట్టు వారు, ఎవరి సంకుచిత అవసరాలకు తగినట్టు వారు నిర్వచించడం కాకుండా నిర్దిష్టమైన, వస్తుగతమైన, సర్వజనామోదమైన నిర్వచనాలు కావాలి.</p>
<p>దేశమంటే మట్టి కాదు గనుక, దేశమంటే మనుషులు గనుక, దేశ ప్రయోజనాలు అంటే దేశంలోని అత్యధిక సంఖ్యాకుల ప్రయోజనాలు అనే అర్థం చెపుకోవలసి ఉంటుంది. ఇప్పతివరకూ దేశంలోని ఒక చిన్న సమూహం ప్రయోజనాలనే దేశ ప్రయోజనాలుగా వ్యాఖ్యానించే పద్ధతి సాగుతోంది. అది మారి, అత్యధిక సంఖ్యాకుల ప్రయోజనాలు అనే అర్థం రావాలి. పిడికెడు మందికి అవసరమైన విలాసాలు తీర్చడమే దేశప్రయోజనాలు అనే అర్థం మారి, కోట్లాది మందికి కనీస అవసరాలయిన కూడూ గూడూ గుడ్డా అందడంలేదనీ, అవి కల్పించడమే మొదటి ప్రాధాన్యత కావాలనీ నిర్వచించుకోవాలి. కాని పాలకపక్షాలు, ఏ మినహాయింపు లేకుండా అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు, ప్రధానంగా సంపన్నవర్గాల, ఎగువ మధ్యతరగతివర్గాల ప్రయోజనాలు తీర్చడమే తమ కర్తవ్యంగా భావిస్తున్నాయి గనుక అసలు ప్రజాప్రయోజనాలు అనే మాటకే తప్పుడునిర్వచనాలు, వ్యాఖ్యానాలు చెలరేగుతున్నాయి.  </p>
<p>అందుకే అన్ని రాజకీయ పక్షాలూ కూడ అణువిద్యుత్తు అవసరమేమిటి, అసలు మన విద్యుత్తు అవసరాలు అన్నప్పుడు ప్రజలలో ఏ వర్గపు, ఏ సమూహపు విద్యుత్తు అవసరాలు అనే ప్రశ్నలు వేయకుండా విద్యుత్తు అవసరాలు ఉన్నాయని స్థూలంగా అంగీకరిస్తున్నారు. ఇప్పటికీ విద్యుత్తు అందని వేలాది ఆదివాసి గూడాలున్నాయి. పూర్తి విద్యుదీకరణ జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ గ్రామాలలో దళిత, వెనుకబడిన వర్గాల గృహాలలో పూర్తి విద్యుదీకరణ కాదుగదా సగం విద్యుదీకరణ అయినా జరిగిందా అనేది అనుమానమే. విద్యుత్ అవసరాలను లెక్కవేస్తున్నపుడు పారిశ్రామిక అవసరాలు, అందులోనూ సంపన్నవర్గాల విలాసవస్తువులను తయారుచేసే పరిశ్రమల అవసరాలు, సంపన్నవర్గాలకు సేవలు అందించే పరిశ్రమల, వ్యాపారాల అవసరాలు, సంపన్న గృహాలలో దుబారా వినియోగ అవసరాలు లెక్కలోకి వచ్చినంతగా ప్రజల నిత్య జీవితంలో అవసరమయిన విద్యుత్తు ఎంత, అది తయారవుతున్నదా లేదా, దానికోసం ఏయే ప్రత్యామ్నాయ ఇంధన వనరులున్నాయి అనే చర్చ జరగడం లేదు. </p>
<p>ఒక తప్పుడు ప్రాతిపదికను ఒకసారి అంగీకరించిన తర్వాత దానిపైన ఎంత హేతుబద్ధమైన, తార్కికమైన వాదన చేసినా ఫలితం ఉండదు. అందువల్లనే ఏ సమస్య చర్చ అయినా మౌలిక అంశాల దగ్గరికి వెళ్లవలసి ఉంటుంది. సాధారణంగా మౌలిక అంశాలను చర్చిస్తారని, హేతుబద్ధ, ప్రజానుకూల విశ్వాసాలు కలిగి ఉంటారని చెప్పుకునే పార్లమెంటరీ వామపక్షాలు కూడ మౌలిక అంశాల మీద ప్రశ్నలు వేయడంలేదు. పార్లమెంటరీ వామపక్షాలు కూడ అట్టడుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం మానివేసి సంపన్నవర్గాలకు, ఎగువమధ్యతరగతి వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్టున్నారు గనుక మౌలిక అంశాల మీద చర్చనుంచి వైదొలగుతున్నారు. దేశ సార్వభౌమాధికారం అనే సుదూర సమస్య మీదనే కేంద్రీకరిస్తున్నారు గాని, అసలు అణువిద్యుత్తు అవసరమేమిటి, అది అవసరమే అయితే దాన్ని ఉత్పత్తి చేయడానికి మనకు ఉన్న సామర్థ్యం, నైపుణ్యం ఎంత, దాని నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించే శక్తి మనదగ్గర ఉన్నదా, ఆ రంగంలో ఇప్పటికే బలపడిఉన్న బహుళజాతి సంస్థల ప్రయోజనాలకొరకు మాత్రమే ఈ విధాన రూపకల్పన జరుగుతున్నదా వంటి అనేక శాస్త్ర, సాంకేతిక, రాజకీయార్థిక ప్రశ్నలన్నిటినీ విస్మరిస్తూ కేవలం సార్వభౌమాధికారం అనే రాజకీయ ప్రశ్న చుట్టూ తిరుగుతున్నారు. </p>
<p>చర్చ ఈ విధంగా పక్కదారి పట్టినప్పుడు, దేశ ప్రయోజనాలు అనేవి ఇంత అస్పష్టంగా నిర్వచించబడుతున్నప్పుదు సహజంగానే సంబంధిత వ్యక్తులు, పక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలనో, పార్టీ ప్రయోజనాలనో ప్రధాన స్థానంలో పెట్టుకుని వాటినే దేశ ప్రయోజనాలుగా చిత్రించడం వీలవుతుంది. ఒక పార్టీ తనకు మంత్రిపదవి ఇస్తే చాలునంటుంది. ఒక ఎంపి తనకు ఇరవై ఐదు కోట్లో, ముప్పై కోట్లో ఇస్తే చాలునంటాడు. మరొక పార్టీ తన రాజకీయ ఎజెండాను పూర్తి చేస్తే చాలునంటుంది. ఇంతకూ అన్ని పార్టీలూ అసలు అణువిద్యుత్ ఒప్పందాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచడమా కూల్చడమా అనే అనవసర వివాదంలో తలమునకలవుతాయి. ఎట్లాగూ మరొక ఎనిమిది నెలల్లో ముగిసిపోయే పదవీకాలం ఉంటే ఎంత ఊడితే ఎంత, ఒప్పందం మీద మాత్రం సంతకం చేసే తీరుతాం అని అధికారపక్షం అనుకుంటుంది.    </p>
<p>ఈ గందరగోళంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అగ్రనాయకులు జ్యోతి బసు, సోమనాథ్ ఛటర్జీ తీసుకుంటున్న వైఖరులు మన రాజకీయ నేతల, రాజకీయ పక్షాల దివాళాకోరు తనానికి అద్దం పడుతున్నాయి. కె ఎన్ వై పతంజలి నవల రాజుగోరు వీరబెబ్బులిలో ‘బోయినం ముఖ్యవా, విశ్వాసం ముఖ్యవా’ అనే ప్రశ్న వస్తే వీరబెబ్బులి బోయినానికే మొగ్గు చూపినట్టు సామ్రాజ్యవాద ప్రయోజనాలను వ్యతిరేకించడమా, పదవిని కాపాడుకోవడమా అనే ప్రశ్న వచ్చినప్పుడు సోమనాథ్ ఛటర్జీ పదవినే ఎంచుకుంటున్నారు. జ్యోతిబసు ప్రస్తుతం ఏ పదవీ లేకపోయినా ఇరవై ఐదు సంవత్సరాలు పదవి అనుభవించి జీర్ణించుకున్న పాలకవర్గ ప్రయోజనాలనే ఎంచుకుంటున్నారు. అంటే అంత వరిష్ట వామపక్ష నేతలకు కూడ దేశ ప్రయోజనాలకూ వ్యక్తిగత ప్రయోజనాలకూ మధ్య ఘర్షణ వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలనే ఎంచుకునే లక్షణం ఉందన్నమాట. నిజంగా చర్చ జరగవలసినది మన రాజకీయ నేతలు తీసుకుంటున్న ఇటువంటి వైఖరులమీద.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[అణు ఒప్పందం అసలు సమస్యలు]]></title>
<link>http://kadalitaraga.wordpress.com/?p=122</link>
<pubDate>Wed, 09 Jul 2008 20:22:11 +0000</pubDate>
<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
<guid>http://kadalitaraga.wordpress.com/?p=122</guid>
<description><![CDATA[అణుఒప్పందం వ్యవహారంలో అమెరికా షరతుల]]></description>
<content:encoded><![CDATA[<p>అణుఒప్పందం వ్యవహారంలో అమెరికా షరతులను అంగీకరిస్తూ ముందుకుసాగడానికి ప్రభుత్వం నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యుపిఎ భాగస్వామ్యపక్షాలయిన వామపక్షాలు కూటమికి మద్దతును ఉపసంహరించుకోవడం ఇవాళ్టి వార్త. ఇది ప్రధానంగా రాజకీయ సంక్షోభంగానో, భారత సార్వభౌమాధికార సమస్యగానో కనబడుతున్నది. <!--more-->ఇంకా కొంచెం ముందుకు వెళితే అది అణువిద్యుత్తు కు సంబంధించిన సాంకేతిక అంశంగా కూడ చూపి ఆ సాంకేతిక నిపుణులు తప్ప మరెవరూ ఆ విషయంలో నోరెత్తడానికి వీలులేదన్న వ్యాఖ్యలూ వినబడుతున్నాయి. </p>
<p>ఇందులో రాజకీయ, సార్వభౌమాధికార, సాంకేతిక అంశాలు ఉన్నమాట నిజమేగాని, వాటితో సమానంగానో, ఇంకా ఎక్కువ ప్రాధాన్యతతోనో రాజకీయార్థిక అంశాలు ఉన్నాయి. ఆ రాజకీయార్థిక అంశాలు అసలు మొత్తం సమస్యకు మూలాధారంగా కూడ ఉన్నాయి. అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామంటున్న ప్రతిపక్షాలు కూడ ఆ రాజకీయార్థిక మూలాలను ప్రశ్నించకపోవడం వల్ల, కొంతవరకు ఆ రాజకీయార్థిక మూలాలను సమర్థించే వాదనలు కూడ చేస్తున్నందువల్ల సమస్య మరింత జటిలం అవుతున్నది. వామపక్షాలు చేస్తున్న వాదనలలో సార్వభౌమాధికార అంశం ఉన్నంతగా అణువిద్యుత్తు గురించిన మౌలిక ప్రశ్నలు లేవు. నిజానికి భారత ప్రభుత్వం నిజమైన సార్వభౌమాధికారాన్ని అనుభవించిన సందర్భాలు ఈ అరవై సంవత్సరాలలో అతి తక్కువ గనుక సార్వభౌమాధికార చర్చకు అర్థం లేదు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అనుకూలత గురించో, జార్జి బుష్ కు ఆయన దాసోహమంటున్న తీరు గురించో వామపక్షాలు చాల తీవ్రమైన అభ్యంతరాలు తెలుపుతున్నాయి గాని, భారత రాజకీయాలలోకి ప్రవేశించిన నాటినుంచీ ప్రపంచబ్యాంకు మాజీ ఉద్యోగిగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు అదే. ప్రధానమంత్రిగా ఉంటూ కూడ రెండు సంవత్సరాలకింద ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఉపన్యాసంలో ఆయన బ్రిటిష్ వలసవాద పాలనను సమర్థించాడు. కనుక ఆయన విదేశీ గులాంగిరీ ఇవాళే కొత్తగా తెలిసినట్టు నటించడం ఆత్మవంచనో, పరవంచనో కావాలి.</p>
<p>అసలు మొత్తంగా అణు ఇంధన వ్యవహారంలోనే సంక్లిష్టత ఉంది. మనమీద అమెరికా పెత్తనం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే మన అణువిద్యుత్తు కార్యక్రమాన్ని సమర్థించవలసి వస్తుంది. అసలు అణువిద్యుత్తు అవసరమా, అది ఎవరి ప్రయోజనాలకోసం అనే ప్రశ్న వేసుకుంటే ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించవలసి వస్తుంది. భారతదేశానికి అణువిద్యుత్తు అవసరమా, ఇతర విద్యుదుత్పత్తి అవకాశాలన్నీ ప్రయత్నించిన తర్వాతనే మనం అణువిద్యుత్తు వైపు చూస్తున్నామా, అణువిద్యుదుత్పత్తి వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించగలమా, అణువిద్యుత్తు వైపు వెళ్లడంలో నిజంగా మన అవసరాల, ప్రాధాన్యతల పాత్ర ఎంత, బహుళజాతి విద్యుత్ కార్పొరేషన్ల పాత్ర ఎంత, వాటికోసం అమెరికా ప్రభుత్వం మనమీద తెస్తున్న ఒత్తిడి ఎంత, ఇంతకూ అణువిద్యుత్తును శాంతియుత ప్రయోజనాలకోసం వినియోగించడం అనేమాటకు అర్థం ఉందా, అలా వినియోగించినా ఎంత విద్యుత్తు తయారు చేయగలం, మిగిలిపోయిన అణువ్యర్థ పదార్థాలు బాంబులు తయారు చేయడానికి తప్ప మరెందుకూ పనికిరానప్పుడు శాంతియుత అణువిద్యుదుత్పత్తి కూడ అంతిమంగా అణ్వస్త్ర దేశంగా మారడానికేనా, అంటే లెక్కాపత్రమూ లేకుండా వేలకోట్లరూపాయల ప్రజాధనాన్ని ఈ రంగానికి బదలాయించి బహుళజాతిసంస్థలకు దోచిపెట్టడమూ, వారి భారతీయ జూనియర్ భాగస్వాములకూ, ఆ రంగంతో సంబంధం ఉండి నిర్ణయాధికారం ఉన్న రాజకీయ వేత్తలకూ వందలకోట్ల రూపాయల ముడుపులు ముట్టడానికేనా వంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవలసి ఉన్నది. </p>
<p>నిజానికి అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న ప్రతిపక్షాలేవీ కూడ ఇటువంటి ప్రశ్నలేమీ వేయడం లేదు. అసలు దేశంలో అణు కార్యక్రమమే చాల అబద్ధాలతో, అతిశయోక్తులతో, అరాచకంగా మొదలయింది. కేవలం ప్రధానమంత్రికి మాత్రమే జవాబుదారీగా ఉండి, మంత్రివర్గానికిగానీ, పార్లమెంటుకుగానీ, ప్రజలకుగానీ ఎటువంటి సమాచారం లేకుండా అణుకార్యక్రమం సాగేలా ఇందిరాగాంధీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2000 నాటికి 10,000 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పాదక శక్తిని స్థాపిస్తామని 1980లమధ్యలో ప్రకటించినప్పటికీ, ప్రస్తుతానికి భారతదేశం సాధించిన స్థాపిత అణువిద్యుదుత్పత్తి శక్తి నాలుగువేల మెగావాట్ల లోపే. ప్రస్తుతం 2020 నాటికి 20,000 మెగావాట్ల స్థాపిత శక్తిని సాధిస్తామనీ, ప్రస్తుతం దేశ విద్యుత్ అవసరాలలో 2.6 శాతాన్ని మాత్రమే తీరుస్తున్న అణు విద్యుత్తును 2020 నాటికి 25 శాతానికి తీసుకుపోతామనీ, అందుకు అవసరమైన యురేనియం నిలువలు దేశంలో లేనందువల్ల దిగుమతి చేసుకోవలసి వస్తుందనీ, అలా దిగుమతి చేసుకోవాలంటే అమెరికా విధిస్తున్న షరతులకు తల ఒగ్గక తప్పదనీ భారత ప్రభుత్వం వాదిస్తున్నది. కాని ఇదంతా పచ్చి అబద్ధం. కేవలం అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రానున్న పదహారు సంవత్సరాలలో 40 బిలియన్ డాలర్లు (నాలుగువేల కోట్ల డాలర్లు, ఒకలక్షా అరవై వేల కోట్ల రూపాయలు) ఖర్చు పెడతామని భారత ప్రభుత్వం 2006లో ప్రకటించింది. అణు విద్యుత్ కేంద్రాలను రూపొందించే, నిర్మించే, మరమ్మత్తు చేసే సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామగ్రి ఐదారు బహుళజాతిసంస్థలకు మాత్రమే ఉన్నది. మనం ఖర్చు పెట్టనున్న లక్షా అరవైవెల కోట్ల రూపాయలు కేవలం నాలుగు బహుళజాతి కంపెనీలకు మాత్రమే చేరుతుంది.  అవి అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, వెస్టింగ్ హౌజ్ అనే కంపెనీలు,  ఫ్రాన్స్ కు చెందిన అరెవా ఎస్ ఎ, ఎలెక్ట్రిసిటె డి ఫ్రాన్స్ అనే కంపెనీలు.</p>
<p>ఈ లక్షా అరవైవేల కోట్ల రూపాయలు కేవలం అణు విద్యుత్ కర్మాగారాలకు మాత్రమే. దానికి ముందూ వెనుకా ఖర్చులు మరింతగా ఉంటాయి. ఆ ఖర్చులలో పదో వంతు నిధులు వెచ్చించినా సౌర విద్యుత్తు గాని, తరంగ విద్యుత్తు గాని, వాయు విద్యుత్తు గాని, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులు గాని అతిచౌకగా తయారు చేసుకోగల సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోవచ్చు. లేదా, మనకు ఇప్పటికే తెలిసి ఉన్న బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాలను స్థాపించుకున్నా మరింత తక్కువ సమయంలో మన అవసరాలు తీర్చుకోవచ్చు. అసలు ఇంతకూ మన విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను అరికట్టే సామర్థ్యం పెంచుకుంటే, విద్యుత్తు వినియోగంలో దుబారాను అరికడితే మూడో వంతు విద్యుత్తును ఆదా చేయవచ్చు. ఇటువంటి ప్రత్యామ్నాయ  మార్గాలేవీ ఆలోచించకుండా అణువిద్యుత్తు వైపు చూడడం వెనుక ప్రయోజనాలు వేరు, అవి ప్రజావసరాలు ఎంత మాత్రం కావు.</p>
<p>అణు ఒప్పందం అనేది అబద్ధపు విద్యుదవసరాల అంచనాలమీద, అబద్ధపు అణువిద్యుత్ సరఫరా మీద ఆధారపడి, బహుళజాతిసంస్థలకు వేలకోట్ల లాభాలు తెచ్చిపెట్టే ప్రక్రియ తప్ప మరేమీ కాదు. దేశాన్ని అనవసరంగా అణ్వస్త్ర ఆయుధపోటీలోకి ఈడ్చి, దేశ రక్షణ వ్యయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి, దేశప్రజల కనీసావసరాలు తీర్చడానికి అవసరమైన నిధులు లేకుండా చేసే కుట్ర. దేశం అణ్వస్త్ర దేశంగా మారిందనే కుహనా గర్వాన్ని, జాతి దురహంకారాన్నీ మధ్యతరగతిలో ఎగసనదోసే కుట్ర, నాయకులకు, అధికారులకు ఎంగిలిమెతుకుల ముడుపులు కట్టబెట్టి స్విస్ బ్యాంకు ఖాతాలు సమకూర్చిపెట్టే కుట్ర ఇది.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[రాజకీయం, ఆర్థికం, అవకాశవాదం]]></title>
<link>http://kadalitaraga.wordpress.com/?p=113</link>
<pubDate>Tue, 20 May 2008 20:15:03 +0000</pubDate>
<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
<guid>http://kadalitaraga.wordpress.com/?p=113</guid>
<description><![CDATA[రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల సంద]]></description>
<content:encoded><![CDATA[<p>రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ‘మీట్ ద ప్రెస్’ సమావేశాలలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు తమ అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు. ఆ అభిప్రాయాలలో ఎక్కువభాగం ఊకదంపుడు మాటలు, ఎంతమాత్రమూ నమ్మని, ఆచరణలో పెట్టదలచుకోని ఆదర్శాలు, ఆత్మస్తుతి, పరనింద ఉంటాయి గనుక వాటిని పట్టించుకోనవసరం లేదు. కాని ఆ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు భారత <!--more-->కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి బి వి రాఘవులు ప్రకటించిన కొన్ని అభిప్రాయాలను రాజకీయార్థిక శాస్త్ర దృక్పథం నుంచి చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఆ రాజకీయార్థిక అభిప్రాయాలు చాల బోలుగా, మార్క్సిస్టు మౌలిక సూత్రాలకు, మార్క్సిస్టు సిద్ధాంత చరిత్రకు చాల దూరంగా ఉన్నాయి. ఆ అభిప్రాయాలు ఆ పార్టీ అనుసరిస్తున్న అవకాశవాదానికి సరిపోతాయేమోగాని నిశితమైన చదువరిగా, మేధావిగా, చతురుడైన వ్యూహకర్తగా పేరుపొందిన రాఘవులుకు సరిపోతాయా అనుమానమే. </p>
<p>ఒక పార్లమెంటరీ రాజకీయపక్షంగా మార్క్సిస్టు పార్టీ ఎన్ని పిల్లిమొగ్గలయినా వేయవచ్చు, ఊసరవెల్లిని తలదన్నేలా ఎన్ని రంగులయినా మార్చవచ్చుగాని, తన అవకాశవాదానికి మద్దతుగా మార్క్సిస్టు రాజకీయార్థిక శాస్త్ర అవగాహనలను ఉంటంకించడానికి, ఇష్టం వచ్చినట్టు వక్రీకరించడానికి వీలులేదు.</p>
<p>యు పి ఎ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూనే రాజకీయంగా వారికి ఎందుకు మద్దతిస్తున్నారనే ప్రశ్నకు జవాబిస్తూ, “రాజకీయాలను తుపాకీ నిర్దేశించగూడదని, తుపాకీని రాజకీయాలు నిర్దేశించాలని చెపుతారు. అంటే ఆర్థిక విధానాలను సైతం నిర్దేశించేది రాజకీయ అంశాలే. ఆర్థిక విధానాలు, రాజకీయ అంశాలు రెండిటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవలసి వస్తే మేం రాజకీయ అంశాలవైపే మొగ్గు చూపుతాం” అని రాఘవులు అన్నారు. అలాగే, గతంలో ప్రపంచబ్యాంకు ఏజెంటంటూ బాబుకు దూరమై, కాంగ్రెస్ తో కలిసిన సిపిఎం ఇప్పుడు ఏ ఆర్థికవిధానం ప్రాతిపదికన కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తోందనే ప్రశ్నకు జవాబుగా “చెప్పానుగా, ఆర్థిక విధానాలకంటే రాజకీయ విధానాలకే ప్రాధాన్యమిస్తామని” అని నొక్కి చెప్పారు.<br />
ఆ ఉవాచలలో రెండు సిద్ధాంతపరమైన, చారిత్రకమైన తప్పులున్నాయి. </p>
<p>అవి ఒకటి, ఆర్థిక విధానాలను సైతం నిర్దేశించేది రాజకీయ అంశాలే అని మార్క్సిజం ఎప్పుడూ చెప్పదు, చెప్పలేదు. మనుషుల నిత్యజీవితావసర ఉత్పత్తి – పునరుత్పత్తిలో భాగమైన ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు అనే ఆర్థిక అంశాలు పునాది అనీ, ఆ పునాది మీదనే న్యాయ, రాజకీయ ఉపరినిర్మాణం రూపొందుతుందనీ, అన్ని సామాజిక చైతన్యరూపాలు ఈ ఉపరితలానికి అనుబంధంగా తయారవుతాయనీ మార్క్స్ తన ‘కాంట్రిబ్యూషన్ టు ద క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ (1859) అనే సుప్రసిద్ధ గ్రంథంలో రాశాడు. “భౌతిక జీవితపు ఉత్పత్తి విధానమే సాంఘిక, రాజకీయ, చైతన్య రూపాల సాధారణ జీవనక్రమాన్ని నిర్ణయిస్తుంది” అనే ప్రముఖ సూత్రీకరణ ఈ పుస్తకంలోనిదే. ఈ మౌలిక మార్క్సిస్టు అవగాహన మీద చాల చర్చ, వక్రీకరణలు, చేర్పులు జరిగాయి గాని, రాజకీయమే ప్రధానం, ఆర్థికం కాదు అని తమ అవకాశవాద రాజకీయాలకోసం తిరగేసి చెప్పడం సిపిఎం నాయకులకే చెల్లింది.</p>
<p>రెండు, అవకాశవాద పాలకవర్గ రాజకీయ చదరంగంలో ఎవరితోక పట్టుకుని పోతామనే అంశాన్ని సమర్థించుకోవడానికి ఆయన అనవసరంగా తుపాకీ ప్రస్తావన తెచ్చారు. నక్సల్బరీ నుంచి నందిగ్రామ్ దాకా అమాయకులను బలిగొన్న సందర్భంలో తప్ప, ఇతరంగా ఎప్పుడో మరిచిపోయిన ఆ తుపాకీ అనే మాట ఎత్తడం ఆశ్చర్యం కాని, ఆ ఉటంకింపుకు ఏమాత్రం సందర్భశుద్ధిలేదు. “మా సూత్రం ఏమంటే తుపాకీని పార్టీ శాసించాలి కాని ఎప్పుడూ పార్టీని తుపాకీ శాసించగూడదు” అనే ప్రసిద్ధ వాక్యాన్ని మావో 1938 లో ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ అండ్ స్ట్రాటెజీ’ అనే వ్యాసంలో రాశాడు. అది విప్లవ, సాయుధ పోరాట సమయం. ఆ తర్వాత సాంస్కృతిక విప్లవ సందర్భంలో 1966లో పెట్టుబడిదారీ మార్గావలంబకులమీద పోరాటంలో ‘రాజకీయాల ఆధిపత్యం’ గురించి కూడ మాట్లాడాడు. ఆ రెండు సందర్భాలకూ ప్రస్తుతం సిపిఎం రాజకీయ ఎత్తుగడల సందర్భానికీ ఏమీ సంబంధం లేదు.<br />
ఇంతకీ ప్రస్తుతం సిపిఎం చేస్తున్నది సాయుధ విప్లవపోరాటమూ కాదు, సాంస్కృతిక విప్లవమూ కాదు. ఇక్కడ రాజకీయాలు, ఆర్థిక విధానాలు అనేంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి ఏమీలేదు. 1951లో వర్గపోరాట రాజకీయాలను, సాయుధపోరాటాన్ని వదిలిపెట్టినప్పటినుంచీ భారతకమ్యూనిస్టుపార్టీ, పుట్టినప్పటినుంచీ మార్క్సిస్టుపార్టీ పాలకవర్గాలలో “ప్రగతిశీల ముఠా”ను వెతుకుతూ వారితో అంటకాగడం ద్వారా ఒకసీటో, అరసీటో ఎక్కువవస్తే చాలుననే ఏకైక వ్యూహంతో పనిచేస్తున్నాయి. ఆ అవకాశవాద విద్యలో సిపిఎం ఒక ఆకు ఎక్కువే చదివింది. అందువల్ల ఇందులో ప్రజారాజకీయాలూ లేవు, ప్రజానుకూల ఆర్థిక విధానాలూ లేవు. ఎవరి పంచనచేరితే ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయి, ఎవరితో పొత్తుపెట్టుకుంటామని బెదిరించి ఎవరితో బేరాలాడొచ్చు అనే లెక్కలేతప్ప ఇందులో సైద్ధాంతిక అంశాలేమీ లేవు. కనుక ఆమాట స్పష్టంగా చెపితే బాగుంటుంది. అనవసరంగా రాజకీయార్థిక అవగాహనల వక్రీకరణ అవసరం లేదు.</p>
<p>తెలుగుదేశం తన ఆర్థికవిధానాలను స్పష్టపరిస్తే వారితో పొత్తు విషయం ఆలోచిస్తామని కొంతకాలం కింద సిపిఎం ప్రకటించింది. తెలుగుదేశం ఆర్థికవిధానాలేమిటో, వాటిని ఇప్పుడు మళ్లీ స్పష్టం చేయవలసిన అవసరమేమిటో అలా ఉంచి అసలు సిపిఎం ఆర్థికవిధానాలేమిటో స్పష్టత ఉందా? ఇప్పుడు సిపిఎం ఆ మాటకూడ వదిలి ఉపఎన్నికలలో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ ఎన్నికల ఎత్తుగడలు ఆ పార్టీ ఇష్టం. కాని అసలు ఆ పార్టీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు భిన్నమైనవి అయితేగదా ఈ చర్చ అంతా. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలతోనూ బేరసారాలు ఆడడంలో ఒక పావుగా అప్పుడప్పుడు కొన్ని రాజకీయ, ఆర్థిక అంశాల కొత్తిమీర, కరివేపాకు చల్లడం మినహా ఆ ఇద్దరు వంటగాళ్లకన్న ఈ వంటగాడి వంట భిన్నంగా ఉంటే గదా. అసలు గత పదహారు సంవత్సరాల ప్రపంచీకరణ క్రమంలో నూతన ఆర్థిక విధానాలను అమలు పరచని పార్లమెంటరీ రాజకీయపక్షం ఒక్కటయినా ఉందా?</p>
<p>పశ్చిమబెంగాల్ లో ముప్పైఏళ్లుగా ఎన్నికల రాజకీయాలు నడుపుతున్న తీరు, నూతన ఆర్థిక విధానాల మీద విమర్శను పుస్తకాలు అమ్ముకోవడానికి మాత్రం పరిమితం చేసుకుంటూ అవే రాజకీయార్థిక విధానాలను అమలు పరుస్తున్నతీరు, ప్రత్యేక ఆర్థికమండలాల విధానాన్ని అందరికంటే ఎక్కువగా అమలు జరుపుతూ చివరికి మనుషులను కాల్చిచంపి పారిశ్రామికీకరణ పేరుతో ప్రత్యేక ఆర్థిక మండలాలను నెలకొల్పుతున్న తీరు  – ఏ రాజకీయార్థిక విధానాలు భిన్నంగా ఉన్నాయని సిపిఎం రాజకీయాల గురించీ, ఆర్థిక అంశాల గురించీ మాట్లాడుతున్నట్టు? ఏ ఆర్థిక అంశాలకు, ఏ రాజకీయాలకు పోటీ వచ్చి ఏ ఆర్థిక అంశాలమీద ఏ రాజకీయాంశాలను ఎంచుకుంటున్నట్టు?</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[నాలుగేళ్లలో సాధించిందేమిటి?]]></title>
<link>http://kadalitaraga.wordpress.com/?p=112</link>
<pubDate>Tue, 13 May 2008 19:57:48 +0000</pubDate>
<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
<guid>http://kadalitaraga.wordpress.com/?p=112</guid>
<description><![CDATA[రాష్ట్రంలో డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి మ]]></description>
<content:encoded><![CDATA[<p>రాష్ట్రంలో డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004 మే 14 న అధికారం చేపట్టిన ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలనను పూర్తిచేసుకున్నది. ఈ నాలుగు సంవత్సరాలలో చాల లోతయిన రాజకీయ, సామాజిక పరిణామాలే జరిగాయి. రాజకీయంగా ఐక్యసంఘటన ప్రభుత్వంగా, మిశ్రమ మంత్రివర్గంగా మొదలయినదల్లా రెండుసంవత్సరాలు తిరగకుండానే ఏకపార్టీ పాలనగామారిపోయింది. <!--more-->పార్టీలోపలా బయటా ప్రత్యర్థులందరినీ బలహీనపరచడం ఏకైక కార్యక్రమంగా సాగింది. ఎన్నికల పొత్తులూ స్నేహాలూ సహజీవనాలూ అన్నీ మారిపోయాయి. సామాజికంగా కులాల ప్రస్తావన, అగ్రకుల ఆధిపత్యం పెరిగిపోయాయి. సామాజికవర్గాల మధ్య అంతరాలు, ఘర్షణలు పెరిగిపోయాయి. </p>
<p>అయితే ఈ రాజకీయ, సామాజిక పరిణామాల కన్న ఎన్నోరెట్లు మిన్నగా ఆర్థిక రంగ పరిణామాలు జరిగాయి గాని సహజంగానే మన ఆలోచనాపరులలో రాజకీయాలమీద ఉన్న ఆసక్తి రాజకీయార్థిక పరిణామాల మీద ఉండదుగనుక అవి పెద్దగా చర్చకు రాలేదు. కాని ప్రస్తుతం మాత్రం ఇది ఉపఎన్నికలవేళ గనుక హఠాత్తుగా అన్ని రాజకీయ పక్షాలూ ప్రజాజీవితం గురించీ, రాజకీయార్థిక పరిణామాల గురించీ తమకు అనుకూలమైన అంశాలు మాత్రం మాట్లాడడం మొదలుపెట్టాయి. తెలుగుదేశం పార్టీ ఏకంగా వందతప్పుల అభియోగపత్రాన్ని విడుదల చేసింది. అవినీతి, రైతుల ఆత్మహత్యలు, హాస్టల్ సౌకర్యాలు కొరవడడం వల్ల విద్యార్థుల మృతి, ప్రభుత్వరంగసంస్థల ఉద్యోగులను తొలగించడం, నిత్యావసర వస్తువుల ధరలు, జలయజ్ఞం, భూముల అమ్మకం వంటి రాజకీయార్థిక ఆరోపణలనెన్నిటినో తెలుగుదేశం పార్టీ చేసింది. ఇతరపార్టీలు అవినీతి గురించి మాట్లాడుతున్నాయి. లోక్ సత్తా నాయకులు జయప్రకాశ్ నారాయణ కూడ కాంగ్రెస్ పాలనలో రోజుకు వందకోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నదనీ, రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారనీ వ్యాఖ్యానించారు. </p>
<p>కాంగ్రెస్ పాలనను విమర్శిస్తున్న ఈ రాజకీయ పక్షాలలో ఏ ఒక్కదానికయినా ఆ అర్హత ఉన్నదా అనే ప్రశ్న ప్రజలవైపు నుంచి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో దీర్ఘకాలం పాలన సాగించిన తెలుగుదేశం చరిత్ర గాని, ఇతర రాష్ట్రాలలో పాలన సాగిస్తున్న ఇతర రాజకీయ పక్షాల చరిత్ర గాని ఇప్పుడు  లేవనెత్తుతున్న ఏ ఒక్క అభియోగం విషయంలోనయినా నిష్కళంకమైనదేమీ కాదు. ఈ ఆరోపణలలో చాలా భాగం ఇవాళ వేలెత్తి చూపుతున్నవారందరికీ వర్తించేవే. </p>
<p>అయితే విమర్శకులకు సాధికారత లేనంత మాత్రాన విమర్శలకు సాధికారత లేకుండాపోదు. నిజంగానే ఈ నాలుగు సంవత్సరాల కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని రాజకీయార్థిక రంగంలో అతి దారుణమైన పరిణామాలెన్నిటికో గురిచేసింది. ఈదేశంలో పాలనకు సంబంధించిన సకల అక్రమాలకు కన్నతల్లి కాంగ్రెసే గనుక దాని నుంచి సత్పరిపాలనను ఆశించడం అత్యాశే గాని, డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి 1995 నుంచి 2004 వరకు నిర్వహించిన ప్రతిపక్ష పాత్ర వల్ల కొందరయినా అలా ఆశించారు. చంద్రబాబు నాయుడును ప్రపంచబ్యాంకు పాలేరుగా అభివర్ణించి, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మాట్లాడినందువల్ల, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నట్టు కనబడి, వ్యవసాయ రంగాన్ని మళ్లీ ఒకసారి కేంద్రస్థానానికి తీసుకువచ్చినందువల్ల, తెలంగాణ రాష్ట్రసమితితో పొత్తు పెట్టుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తించినట్టే కనబడినందువల్ల, రాజశేఖరరెడ్డి పాలన సగటు కాంగ్రెస్ పాలనలా ఉండకపోవచ్చునని కొందరయినా భ్రమ పడ్డారు. </p>
<p>కాని ఈ నాలుగు సంవత్సరాల అనుభవం చూస్తే, ప్రత్యేకించి రాజకీయార్థిక విధానాలలో తెలుగుదేశం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ తు.చ. తప్పకుండా అమలు చేస్తూ వచ్చింది. బహుశా కొన్ని రంగాలలో తెలుగుదేశం కన్న రెండాకులు ఎక్కువే చదివాననిపించుకుంటున్నది.<br />
వ్యవసాయరంగానికి అధికప్రాధాన్యం ఇవ్వడం, వ్యవసాయరంగానికి మేలుకల్పించేలా కొత్త నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, అందుకోసం ప్రత్యేకంగా జలయజ్ఞం కార్యక్రమాన్నే చేపట్టడం వంటి సదుద్దేశ్యంతో ప్రారంభమైన విధానాలలో కూడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం వెల్లువెత్తుతున్నాయి. నీటికోసం, వ్యవసాయ అవసరాల కోసం ప్రాజెక్టులు కాకుండా కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించడం, వేలాది కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం జరుగుతోంది. మూడుసంవత్సరాలలో పూర్తవుతాయని వాగ్దానం చేసిన ప్రాజెక్టులేవీ నాలుగు సంవత్సరాలయినా పూర్తి కాలేదు. ఇంకా దీర్ఘకాలిక వ్యవధి పెట్టిన ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో, అప్పటికి ఈ ప్రభుత్వముంటుందోలేదో, పూర్తయినా వాటికి తగిన నీరు ఉంటుందోలేదో తెలియదు. నిజంగా కొత్త ఆయకట్టు కల్పించగల, దుర్భిక్ష ప్రాంతాల ప్రాజెక్టులు నత్తనడకలు నడుస్తుండగా, కృష్ణాజిల్లాకు మూడో పంటకు నీరందించే పులిచింతల, కాకినాడ – విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ లో బహుళజాతిసంస్థల నీటి అవసరాలు తీర్చే పోలవరం మాత్రం శరవేగంతో సాగుతున్నాయి. </p>
<p>మరొకవైపు వ్యవసాయరంగ సంక్షోభంవల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఉపశమనం కలిగించడం, ఆత్మాహత్యలను ఆపడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం మాటల్లో జరిగినంతగా చేతల్లో జరగలేదు. ఈ నాలుగేళ్లలో కూడ రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ వచ్చాయి.<br />
అలా ఒకవైపు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోగా, కొనసాగుతున్న దుస్థితిని మార్చకపోగా, ఈ ప్రభుత్వం రైతాంగం మీదికి, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులమీదికి కొత్త మహమ్మరిని కూడ తీసుకువచ్చింది. ప్రత్యేక ఆర్థికమండలాల రూపంలో వచ్చిన ఈ మహమ్మారి రైతులను తమ పంటభూములనుంచి వెళ్లగొట్టి దేశదేశాల సంపన్నులకు ఆ భూములను కారుచౌకగా కట్టబెట్టే పథకం రచించింది. మిగిలిన రాష్ట్రాలకన్న ఎక్కువ ప్రత్యేక ఆర్థిక మండలాలను ఏర్పరచడానికి, అంటే మిగిలిన రాష్ట్రాలలో కన్న ఎక్కువమంది రైతులను నిరాశ్రయులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. </p>
<p>పట్టణభూముల అమ్మకాల కార్యక్రమాన్ని మొదలుపెట్టి బహుళజాతిసంస్థలకు, సంపన్నులకు, ఆశ్రితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టే పనిని చంద్రబాబు నాయుడు ప్రారంభించగా ఈ నాలుగు సంవత్సరాల పాలన ఆ పనిని మరెన్నో రెట్లు ఎక్కువగా సాగిస్తోంది. ఆదివాసులభూములలో ఖనిజ నిలువలు ఉన్న పాపానికి వారిని వారి ఆవాసాలనుంచి వెళ్లగొట్టి, ఆ ఖనిజాలను బహుళజాతిసంస్థలకు దోచిపెట్టే ఆలోచనలు గత ప్రభుత్వం ప్రారంభించగా ఈ ప్రభుత్వం పెద్దఎత్తున ఆచరణలో పెట్టింది. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వరంగసంస్థలను మూసివేయడానికి, అమ్మివేయడానికి తెలుగుదేశం మొదలుపెట్టిన ప్రయత్నాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది.   </p>
<p>తెలుగుదేశం పాలనపట్ల ప్రజలు విసిగిపోయిన కారణాలలో వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం ఒకటి కాగా, ప్రపంచబ్యాంకు పాలనకిందికి రాష్ట్రాన్ని తీసుకుపోయి, ఆంధ్రప్రదేశ్ రుణభారం పెంచడం ప్రధానమయినది. ప్రతిపక్షనాయకుడి హోదాలో ఈ పరిణామాన్ని అతి తీవ్రంగా విమర్శించిన రాజశేఖరరెడ్డి తాను అధికారంలోకి రాగానే ఆ ప్రపంచబ్యాంకు అప్పులను, షరతులను కనీసం సమీక్షించలేదు సరిగదా, కొత్త అప్పులు చేయడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రుణభారం తెలుగుదేశం పాలనాంతంలో ఉన్నదానికన్న ఈ నాలుగు సంవత్సరాలలో రెట్టింపు అయిపోయింది. ఒక్కమాటలో చెప్పలంటే ప్రస్తుతం సాగుతున్నది రెండో చంద్రబాబు పాలనే తప్ప మరొకటి కాదు.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[పందికొక్కుల ప్రేలాపనలు]]></title>
<link>http://kadalitaraga.wordpress.com/?p=111</link>
<pubDate>Tue, 06 May 2008 20:00:04 +0000</pubDate>
<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
<guid>http://kadalitaraga.wordpress.com/?p=111</guid>
<description><![CDATA[భారతీయులు ఎక్కువ తింటూ ఉండడం వల్లనే ]]></description>
<content:encoded><![CDATA[<p>భారతీయులు ఎక్కువ తింటూ ఉండడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా ఆహారపదార్థాల ధరల పెరుగుదల సంక్షోభం వచ్చిందని అమెరికన్ పాలకవర్గ ప్రతినిధులు కొత్తపాట ఎత్తుకున్నారు.</p>
<p><!--more-->నిజానికి ప్రపంచ జనాభాలో ఐదు శాతం కన్న తక్కువ ఉన్న అమెరికన్లు ప్రపంచవనరులలో 25 శాతం పైగా వాడుకుంటూ ఉండడంవల్ల, అమెరికన్లు తినగామిగిలి పారవేసే, తినడానికి పనికివచ్చే ఆహారపదార్థాలే రోజుకు రెండు లక్షల టన్నులు ఉండడం వల్ల, ఆహారపంటలకు వ్యతిరేకంగా అన్ని మూడో ప్రపంచదేశాలమీద రుద్దిన ప్రపంచీకరణ విధానాలవల్ల ఇవాళ్టి ఆహారకరువు ఏర్పడుతున్నదనే అసలు వాస్తవాన్ని దాచడానికి ఇతరులమీద ఇటువంటి దురహంకారపు నిందలు మోపడం అమెరికన్ పాలకవర్గాలకు అలవాటే.<br />
భారతదేశంలో మధ్యతరగతి విపరీతంగా పెరిగిపోయిందని, ప్రస్తుతం 35 కోట్లుగా ఉన్న భారతీయ మధ్యతరగతి అమెరికా జనాభాకన్న ఎక్కువని, ఆ మధ్య తరగతి ఎక్కువ తిండి తింటున్నందువల్లనే అంతర్జాతీయ ఆహారధాన్యాల ధరలు పెరిగిపోతున్నాయని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ మే 2 న మిస్సోరిలో ఒక సమావేశంలో అన్నాడు. ప్రతి సంవత్సరం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ముప్పైకోట్ల టన్నుల ఆహారపదార్థాలను వాడుతున్నది. దానిలో కనీసం పదికోట్ల టన్నుల ఆహారపదార్థాలతో ఇంధనం తయారు చేస్తున్నారని, అది ఆహార సంక్షోభానికి, ఆహారపదార్థాల ధరల పెరుగుదలకు దారి తీస్తున్నదని వచ్చిన విమర్శలను ఖండించడం బుష్ ఉద్దేశ్యం. ఆ వాదనలను ఖండిస్తూ అది ఒక కారణం మాత్రమేనని, వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఇంధనవ్యయం వగైరా కారణాలు కూడ ఉన్నాయని బుష్ అన్నాడు. కాని ఎన్నికారణాలను ప్రస్తావించినా, తమ రాజకీయార్థిక విధానాల కారణాలను తక్కువచేసి చూపి, భారతీయులవైపు, చైనీయులవైపు వేలెత్తి చూపడం బుష్ కోరిక.<br />
రెండురోజుల ముందే వాషింగ్టన్ లో ఒక సమావేశంలో అమెరికా ఆంతరంగిక వ్యవహారాల శాఖ కార్యదర్శి కాండోలీజా రైస్ కూడ భారతీయులు, చైనీయులు ఎక్కువ తిండి తింటున్నందువల్లనే ధరలు పెరుగుతున్నాయని అంది. ఎక్కువతిండి తింటూ భారత్, చైనాలు ఎగుమతులమీద ఆంక్షలు విధించి, ఆహారాన్ని తమ దేశాలలోపలే ఉంచుకుంటున్నందువల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆమె అంది. మాటవరసకు ఇతర కారణాలను చెప్పినప్పటికీ ఆమె భారతీయుల ఆహారపుటలవాట్లను ప్రముఖంగా ప్రస్తావించింది.</p>
<p> </p>
<p>భారతీయుల తిండి గురించి ప్రపంచంలోకెల్లా పెద్ద తిండిపోతులు, ప్రపంచాన్ని కబళిస్తున్న పందికొక్కులు అసూయపడడంలో వింత ఏమీలేదు. ముప్పైకోట్ల జనాభాతో ముప్పైకోట్ల టన్నుల ఆహారధాన్యాలను వాడుతున్న అమెరికన్లు నూటపదికోట్ల జనాభాతో ఇరవైకోట్ల టన్నుల ఆహారధాన్యాలను వాడుతున్న భారతీయులను వేలెత్తి చూపుతున్నారు. అందుకు వాళ్లకు సిగ్గు లేకపోయినా మౌనంగా అంగీకరిస్తున్నామంటే మన ఆత్మగౌరవం ఎలా ఉన్నదనుకోవాలి? పేరుకు అధికార కాంగ్రెస్ కూడ అమెరికా వ్యాఖ్యలను ఖండించినప్పటికీ, ‘బుష్ దొరగారి మాట తప్పు’ అని చెప్పడానికి ప్రపంచప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త, మహామేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు మాత్రం నోరు పెగలడంలేదు.</p>
<p> </p>
<p>బుష్, కాండోలీజా రైస్ ల వాదనలను అమాయకంగా నమ్మేవారెవరయినా ఉండవచ్చుగనుక, ఆ వాదనలను విశ్లేషించుకోవాలి. ఒకటి, భారతీయుల ఆహారపుటలవాట్ల గురించి మాట్లాడేముందు అమెరికన్ల ఆహారపుటలవాట్ల గురించి మాట్లాడాలి. రెండు, ఈ వాదనలకూ వాస్తవ గణాంకాలకూ ఏమన్నా పొంతన ఉన్నదా చూడాలి. మూడు, భారతీయులలో ఒక చిన్న భాగం ఆహారపుటలవాట్లు మారుతున్నమాట నిజమే అయినప్పటికీ దేశంలో అత్యధికసంఖ్యాకులకు రోజుకు రెండుపూటలా తిండి కూడ దొరకడం లేదనీ, అందువల్ల మొత్తం వినియోగం పెరగడం లేదనీ గుర్తించాలి.</p>
<p> </p>
<p>అమెరికన్లు రోజుకు 81,500 కోట్ల కాలరీల ఆహారం తింటారు. నిజానికి ప్రపంచ సగటు చూసినా, ఒక సగటు మనిషి తినగల పరిమాణం చూసినా అమెరికన్ జనాభాకు 60,000 కోట్ల కాలరీలు చాలు. అంటే అమెరికన్లు అదనంగా తింటున్న ఆహారం ఇరవైవేలకోట్ల కాలరీల పైన. దానితో కనీసం మరొక ఎనిమిది కోట్ల మందికి ఆహారం దొరుకుతుందని ఒక అంచనా. అమెరికన్లు తమ దేశంలో రైతులకు విపరీతమైన సబ్సిడీలు ఇచ్చి పండించే మక్కజొన్నలో 80 శాతం, ఓట్స్ లో 90 శాతం పశువులకు దాణాగా వాడుతున్నారు. గత సంవత్సరం అమెరికన్ ఆహారధాన్యాల వినియోగం 11 శాతం పెరిగింది. ఆ పెరుగుదలే మూడు కోట్ల ముప్పై లక్షల టన్నులు ఉంది. భారత వినియోగంలో పెరుగుదల మూడు శాతానికన్న తక్కువ, అంటే నలభై లక్షల టన్నులు మాత్రమే. ఈ గణాంకాలన్నీ ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఎ ఒ), ప్రపంచబ్యాంకు, స్వయంగా అమెరికన్ ప్రభుత్వం ఇచ్చినవే గాని విమర్శకులు తయారుచేసినవి కావు.</p>
<p> </p>
<p>నిజానికి భారతీయులు వినియోగిస్తున్న ఆహారపదార్థాల పరిమాణం, ఆహారపదార్థాల మీద పెడుతున్న ఖర్చు రోజురోజుకూ దిగజారుతున్నదని ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆహారపదార్థాల ధరలు పెరిగిపోవడంతో, ప్రజాపంపిణీవ్యవస్థ, చౌకధరల దుకాణాలు క్షీణించిపోవడంతో జనాభాలో మూడింట రెండువంతుల కుటుంబాలకు చాలినంత ఆహారపదార్థాలు కొనుక్కోవడమే దుర్లభమైపోతోంది. నెలసరి కుటుంబ వ్యయంలో ఆహారం వాటా క్రమంగా తగ్గిపోతున్నదని, లేదా ఖర్చు యథాతథంగా ఉన్నా, ఆ డబ్బుకు వచ్చే ఆహారపదార్థాల పరిమాణం తగ్గుతున్నదని, అందువల్ల స్త్రీలలో, శిశువులలో పోషకాహారలోపం పెరిగిపోతున్నదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. లక్షలాది ఎకరాల పంటభూములను ఒకవైపు ప్రభుత్వం, మరొకవైపు కార్పొరేట్ సంస్థలు ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుమీద రియల్ ఎస్టేట్లు గానో, విదేశీ స్వదేశీ సంపన్నుల విలాస ప్రాంతాలు గానో మారుస్తుండగా దేశంలో ఆహారపదార్థాల, తిండిగింజల ఉత్పత్తి నానాటికీ తగ్గిపోతున్నది. ఇటువంటి కల్లోల పరిస్థితుల్లో లక్షలాది గ్రామీణ కుటుంబాలకు, పొట్టచేత పట్టుకుని పట్టణాలకు చేరుతున్న కుటుంబాలకు కనీస ఆహారభద్రత కొరవడుతోంది. ఈ విధానాలన్నిటికీ మూలవిరాట్టయిన అమెరికా రాజకీయార్థిక విధాన నిర్మాతలే మన పేదలకు, మధ్యతరగతికి దొరుకుతున్న నాలుగు మెతుకుల మీద కూడ అసూయ పడుతున్నారు.</p>
<p> </p>
<p>అయితే భారతీయులందరినీ ఆయన ఏమీ అనలేదని, కేవలం మధ్యతరగతినే అన్నాడని ఇప్పటికీ బుష్ దొరను సమర్థించే బుద్ధిమంతులు కూడ ఉన్నారు. నిజానికి మధ్యతరగతి విషయంలో ఆయన చెప్పిన లెక్క తప్పు. మధ్యతరగతి అంటే ఏమిటనే నిర్వచనం విషయంలో గందరగోళాలు, భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాని, ప్రపంచీకరణ మొదలయినప్పటినుంచీ, అంతర్జాతీయ మార్కెట్ సంస్థలు, బహుళజాతిసంస్థలు అన్నీ ఆ లెక్కలు వేస్తూనే ఉన్నాయి. అపారమైన నిరుపేద జనాభా ఏమయిపోయినా ఫరవాలేదుగాని, తమ సరుకులకూ, అభిప్రాయాలకూ కొనుగోలుదార్లయిన మధ్యతరగతి జనం ఎంత మందనే లెక్కలు వేస్తూనే ఉన్నారు. ఆ లెక్కలు ఇంకా కచ్చితంగా తేలలేదు గాని ఇరవై కోట్లకు మించలేదు. ఇప్పుడు దొరవారు దాన్ని ఏకంగా ముప్పై ఐదుకోట్లు చేసివేశారు.</p>
<p> </p>
<p>ముప్పై ఐదుకోట్లు కాదుగాని, బహుశా ఒక కోటి మంది, అమెరికన్ల నోటికాడిముద్ద కాదుగాని, ఈదేశంలోని కోట్లాది ప్రజల నోటికాడి ముద్దలాక్కుంటున్న స్వదేశీయులున్నరు. దేశీ విదేశీ సంపన్నులకు ఊడిగం చేయడానికి, ఈ దేశ ప్రజలమీద కుట్రలకూ కుహకాలకూ రంగం సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు నిజంగానే ఈదేశంలో పందికొక్కులయ్యారు గాని వారు బుష్ దొర దళారీలే గనుక ఆయన మాటలు వారిని ఉద్దేశించి అయి ఉండవు. అశేష భారత ప్రజానీకాన్ని ఇంకా ఎక్కువగా దారిద్ర్యంలోకి, ఆహారకొరతలోకి నెడుతున్న ప్రపంచీకరణకర్తల లోలోపలి భావాలు అవి. మనం తినగూడదని, బతకగూడదని, మన తిండినీ, మన వనరులనూ, మన బతుకులనూ తామే కొల్లగొట్టాలనీ ప్రపంచీకరణ శక్తుల కోరిక ఈ రూపంలో బయటపడింది.</p>
<p> </p>
<p>మనపట్ల ఇంతటి అవమానకరమైన మాటలు అన్న విదేశీ పాలకులను, వారి అంటకాగుతున్న మన పాలకులను ఏం చేయవలసి ఉంది?</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[పోలేపల్లి విషాదగాథల బాధ్యులెవరు?]]></title>
<link>http://kadalitaraga.wordpress.com/?p=109</link>
<pubDate>Tue, 22 Apr 2008 19:41:23 +0000</pubDate>
<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
<guid>http://kadalitaraga.wordpress.com/?p=109</guid>
<description><![CDATA[అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్త]]></description>
<content:encoded><![CDATA[<p>అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, <!--more-->హైదరాబాదునుంచి దక్షిణంగా వెళ్లే జాతీయరహదారిమీద దేశదేశాల సంపన్నుల పెట్టుబడులు ప్రవహించి రాష్ట్రాన్నీ, దేశాన్నీ అందలాలెక్కిస్తాయనీ అమెరికాతో సమానంచేస్తాయనీ ఏలినవారూ వారిబంట్లూ నమ్మబలుకుతున్న దారి పక్కన ఏం జరుగుతున్నదో చూడండి. నిన్నటిదాకా మనుషులు కలకలలాడినచోట సమాధులు లేచి నిలుస్తున్నాయి.  అంతులేని విషాదం విస్తరిస్తోంది. పల్లె కన్నీటిధారలు ఎడతెగకుండా ప్రవహిస్తున్నాయి. పచ్చని పంటపొలాలు బహుశా రసాయనాలకంపు కొట్టబోయే మొండిగోడలుగా లేచినిలుస్తూ జీవితాలను కూల్చేస్తున్నాయి. పాలకుల అభివృద్ధి మాయాజాలం నిరుపేదబతుకులను వలవేసి పట్టి మట్టుబెడుతోంది. </p>
<p>ఆ ఊరిపేరు ప్రస్తుతానికి పోలేపల్లి కావచ్చు. ముదిరెడ్డిపల్లి కావచ్చు. గుండ్లగడ్డ తండా కావచ్చు. నిన్న కాకినాడో, తడో, సత్యవేడో, సూళ్లూరుపేటో కావచ్చు. అంతకుముందు ఒరిస్సాలో పారాదీప్, కళింగనగర్ లు కావచ్చు. ఉత్తరప్రదేశ్ లో దాద్రి కావచ్చు. హర్యానాలో జజ్జర్ కావచ్చు. పశ్చిమబెంగాల్ లో నందిగ్రామ్, సింగూర్ లు కావచ్చు. మహారాష్ట్రలో రాయగడ్ కావచ్చు. పంజాబ్ లో బర్నాలా, అమృతసర్ లు కావచ్చు. పేర్లే మారతాయిగాని దేశంలో కనీసం మూడువేల గ్రామాలలో కనీసం పదిలక్షల కుటుంబాలలో చిచ్చుపెట్టబోతున్న “వెలుగు” ఇది. తాతముత్తాతలనాటినుంచి తమ బొడ్రాయితో, తమ కూరాటికుండలతో, తమ గుడిసెలతో, తమ జొన్నకర్రలతో, తమ కట్టమైసమ్మలతో, పోశమ్మలతో, తమ ఏడ్పులతో నవ్వులతో పండుగలతో ప్రమాదాలతో తమవైన బతుకులు బతికిన ఊళ్లు ఇప్పుడిక చెరిగిపోతాయి. ప్రత్యేక ఆర్థిక మండలం అనే కొత్త మాయదారి పేరు అద్దుకుంటాయి.</p>
<p>ఇవాళ్టికి పోలేపల్లి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఆ ఊరు, ఆ ఊరి ప్రజలు చేసిన పాపమల్లా హైదరాబాదు అనే దీపం నీడ కింద ఉండడమే. బహుళజాతిసంస్థల, ప్రపంచీకరణ శక్తుల, దేశదేశాల సంపన్నుల కళ్లు పడ్డప్పటినుంచీ, నూతన ఆర్థిక విధానాల మహమ్మారి సోకినప్పటినుంచీ ఆ దీపం కాంతి రోజురోజుకీ పెరిగిపోతోంది. అంతగానే దానికిందనీడలూ పెరిగిపోతున్నాయి. ఆ పెరుగుతున్న వెలుగుకు కావలసిన చమురుకోసం చుట్టూ ఐదు జిల్లాల ప్రజల పొట్టకొట్టడం మొదలయి చాల రోజులయింది. </p>
<p>ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది ఎకరాలను “అభివృద్ధి” అవసరాల కోసం స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలేపల్లి చుట్టుపట్ల వందల ఎకరాలనుంచి ప్రజలను వెళ్లగొట్టి పెద్దల అవసరాల కోసం అప్పగించాలని 2001లో అప్పటి ఆంధ్రప్రదేశ్ సిఇఓ నిర్ణయించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఆ భూమంతా ఎప్పుడో 1894లో వలసవాద ప్రభుత్వం చేసిన భూస్వాధీన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐఐసి)  సొంతమయిపోయింది. అప్పటినుంచి ఆ భూమిమీద ఎవరెవరి కళ్లుపడ్డాయో తెలియదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. కాని పాలకుల నీతి ఏమీ మారలేదు. పాలకులు అనుసరించే రాజకీయార్థిక విధానాలు వారి జెండాలతో, ప్రకటనలతో నిమిత్తం లేకుండా యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏడేడు సముద్రాల అవతలి తెల్లదొరలు పెట్టిన షరతుల ఫలితంగానో, వాళ్లు విసిరిన ఎంగిలిమెతుకులమీద ఆశతో స్వచ్ఛందంగానో స్వతంత్రభారతపాలకులు ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేసిన ఆ రాజకీయార్థిక విధానాలలో ఒకానొక అధ్యాయమయిన ప్రత్యేక ఆర్థిక మండలాలు మొదలయ్యాయి. </p>
<p>ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లు ఇవ్వజూపుతున్న రాయితీల, సౌకర్యాల ఆకర్షణలో రాష్ట్రం నుంచి ఔషధ పరిశ్రమ తరలిపోతున్నదని, ఆ రెండు రాష్ట్రాలలో వందల పరిశ్రమలు వచ్చాయని, ఆంధ్రపదేశ్ నుంచే నలభై యాభై సంస్థలు తరలి వెళ్లాయని 2006 మొదట్లో గగ్గోలు మొదలయింది. ప్రతిస్పందనగా పాలకులు ఔషధ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేకఆర్థికమండలాన్ని స్థాపిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో మొదట 300 ఎకరాలతో ప్రారంభించి క్రమంగా వెయ్యి ఎకరాలకు విస్తరించగల సెజ్ ను ఔషధ పరిశ్రమకోసం ఎపిఐఐసి ఏర్పాటు చేయబోతున్నదని 2006 సెప్టెంబర్ లోనే వార్తలు వెలువడ్డాయి. నిజానికి సెజ్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినది 2005 మే లో. ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలు తయారయినది 2006 ఫిబ్రవరిలో. కాని సెప్టెంబర్ కల్లా రాష్ట్రప్రభుత్వం ఔషధ సెజ్ ఆలోచన ప్రకటించడం, అక్టోబర్ లో కేంద్రప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన అనుమతుల బోర్డు ఈ సెజ్ కు అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ కేంద్రప్రభుత్వ ఉత్తర్వు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ లో, జడ్చర్ల మండలం పోలేపల్లిలో 101.17 హెక్టార్ల విస్తీర్ణంలో ఫార్ములేషన్ పరిశ్రమకోసం సెజ్ స్థాపించడానికి అనుమతించింది. అరబిందో ఫార్మాసూటికల్స్, హెటెరోడ్రగ్స్ అనే పెద్ద సంస్థలు, మరికొన్ని చిన్నసంస్థలు ఇక్కడ తమ ఔషధ ఉత్పత్తి ప్రారంభిస్తాయని 2006లో అన్నారు. కాని అప్పుడు ఆపేరుతో భూమి సంపాదించుకున్న సంస్థలు కూడా ఇప్పుడు వెనక్కిపోతున్నాయని తెలుస్తోంది. అయినా చట్టప్రకారమే ఒకసారి సెజ్ గా ప్రకటించినతర్వాత సంపాదించిన భూమిలో 35 శాతాన్ని మాత్రమే చెప్పిన పనికి ఉపయోగించి, మిగిలిన 65 శాతాన్ని తమ ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి ఆ సంస్థలకు అనుమతి దొరుకుతుంది. క్రమక్రమంగా ఆ 101 హెక్టార్లు (249 ఎకరాలు) పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఎంత విస్తీర్ణానికి చేరాయో, ఏ ఔషధ కంపెనీల పేరుమీద ఏ రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి చేరాయో తెలియదు. </p>
<p>ఉత్తరాది రాష్ట్రాలలో తమకు అందుతాయని రాష్ట్రప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి చూపిన రాయితీలు - పది సంవత్సరాలపాటు ఎక్సైజ్ సుంకంపై మినహాయింపులు, అమ్మకంపన్ను, ఆదాయపుపన్ను పూర్తిగా రద్దు. అంటే ఇప్పుడు పోలేపల్లి సెజ్ లో ఔషధ సంస్థలు వస్తే గిస్తే కూడా అవి ఎక్సైజ్ సుంకాలు కట్టనక్కరలేదు. అమ్మకపు పన్నులు చెల్లించనక్కరలేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రజల భూమిని వాడుకుని, ప్రభుత్వం కల్పించిన విద్యుత్తు, నీరు, రవాణా, సమాచార సౌకర్యాలన్నిటినీ వాడుకుని, చౌకశ్రమతో సంపాదించిన లాభాలపై ఆదాయపు పన్ను కూడ కట్టనక్కరలేదు. మరి దేశానికీ రాష్ట్రానికీ రాష్ట్ర ఖజానాకూ వీసం కూడా లాభం చేకూర్చని, కేవలం పెట్టుబడిదార్ల లాభాలను మాత్రమే ఇబ్బడిముబ్బడిగా పెంచే ఈ పథకానికి ప్రజలు ఎందుకు త్యాగం చేయాలి? ప్రజలు తమ భూములనూ, భవిష్యత్తునూ, ప్రాణాలనూ ఎందుకు బలిపెట్టాలి? ప్రజలు తమ తాతముత్తాతలనాటినుంచి ఉన్న స్థలాలనుంచి ఎందుకు తొలగిపోవాలి? </p>
<p>అలా తొలగిపోయిన రైతులకు నష్టపరిహారం వస్తుందిగదా, ఇక సమస్య ఏమిటి అని కొందరు బుద్ధిమంతులు ప్రశ్నిస్తారు. కాని శాశ్వత జీవనాధారమైన భూమిని లాక్కొని ఏదో కొంత డబ్బు విదిలిస్తే అది ఎటువంటి జీవనోపాధిని, జీవన భద్రతను కల్పించగలుగుతుంది? అది కూడ మొదట ఎకరానికి రు. 18,000 నుంచి రు. 30,000 అన్నప్పటికీ లంచాలు పోగా అందులో నాలుగోవంతు కూడ బాధితులకు దక్కలేదు. ఆ కొద్దోగొప్పో నష్టపరిహారం కూడ దక్కేది భూమి ఉన్న రైతులకు మాత్రమే. మన గ్రామాలలో కనీసం సగం జనాభా అయినా భూమిలేని నిరుపేదరైతులు. వారికి దక్కేది ఏమీ ఉండదు. మరోవైపు చేతులుమారిన భూమి ఇప్పుడు పలుకుతున్న ధర ఎకరానికి నలభై లక్షల రూపాయల పైనే. </p>
<p>అలా తమ పొలాల నుంచి, తమ గ్రామం నుంచి  బేదఖల్ చేయబడి, తమ భూములమీద తామే నిర్మాణ కూలీలుగా మారిన వేదనతో, తమ భూమి తీసుకోవద్దని పోరాడినందుకు ప్రభుత్వం బహూకరించిన లాఠీ దెబ్బలు, అరెస్టులు, జైళ్లు, కేసులు వంటి బహుమానాల అవమానాలతో, వేదనతో ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ల సంఖ్య ఇరవై నుంచి నలభై ఐదు దాకా ఎంతయినా కావచ్చు. </p>
<p>ఈ పాపంలో మనందరం తలాపిడికెడు పంచుకోవలసిందే. నూతన ఆర్థిక విధానాలను తెచ్చిన పాలకులు, ఆ విధానాలను గత పదిహేను సంవత్సరాలుగా కొనసాగిస్తున్న అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాలు, ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాన్ని తాము పాలిస్తున్న రాష్ట్రాలలో అమలు జరుపుతూ, ఇతరరాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న రాజకీయ పక్షాలు ఈ దుర్మార్గానికి ప్రధాన బాధ్యులు. ప్రపంచీకరణ విధానాలను ఆమోదించి ఆహ్వానించిన పత్రికలు, ప్రచార సాధనాలు, ప్రపంచీకరణ వల్ల తమ విలాసాలు పెరిగితే చాలునని, పొరుగువాళ్లు ఏమయిపోయినా ఫరవాలేదని నిర్లిప్తతలోకి వెళ్లి, గొంతులేనివాళ్లకు గొంతునివ్వవలసిన సామాజిక బాధ్యత మరిచిపోయిన మధ్యతరగతి కూడ ఈ విషాదగాథలకు బాధ్యత వహించాలి. మాట్లాడగలవాళ్ల మౌనమే అసలు సమస్య.</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[ధరలు పైపైకి ఎక్కడికి వెళతాయి?]]></title>
<link>http://kadalitaraga.wordpress.com/?p=108</link>
<pubDate>Wed, 16 Apr 2008 15:58:05 +0000</pubDate>
<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
<guid>http://kadalitaraga.wordpress.com/?p=108</guid>
<description><![CDATA[ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజక]]></description>
<content:encoded><![CDATA[<p>ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజకీయ పక్షాలన్నిటికీ ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకువస్తోంది. ప్రజాసమస్యల మీద ఆందోళనలకు దిగడమూ, ఆ సమస్యల పరిష్కారానికి చిట్కాలు తమదగ్గర మాత్రమే ఉన్నాయనీ, అవతలిపక్షం ఆ సమస్యలను పరిష్కరించజాలదనీ అనడమూ రోజురోజుకూ ధరల లాగ, పాపంలాగ పెరిగిపోతున్నాయి. <!--more-->లోక్ సభకూ, అనేక రాష్ట్రాల శాసనసభలకూ పద్ధతి ప్రకారం జరిగినా సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా పన్నెండు నెలల్లోకి వచ్చేశాయి. మరికాస్త ముందుకు జరుగుతాయని కూడ అంటే ఏడెనిమిది నెలల లోపే జరగవచ్చుననీ వదంతులు ఉన్నాయి. </p>
<p>సరిగ్గా ఈ సమయంలో అధికధరల మీద, నిత్యావసరవస్తువుల ధరలు నానాటికీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం మీద చర్చ మొదలయింది. ధరల పెరుగుదల అనేది ప్రతిమనిషినీ కలవరపరుస్తున్న సమస్యే. ఏది కొనబోయినా ధరలు చుక్కలనెక్కి కూచున్నాయని ప్రతిఒక్కరూ గుర్తిస్తూనే ఉన్నారు. అయితే అందరికీ తెలిసిన ఈ మామూలు సమస్య చుట్టూ అర్థశాస్త్రం పెద్ద మాయపొర కప్పింది. ధరల పెరుగుదలను ప్రభుత్వ, ఆర్థికశాస్త్ర పరిభాషలో ద్రవ్యోల్బణం అంటారు. ఆ మాటకు నిజమయిన అర్థమూ, అది గణించే పద్ధతీ ఎక్కువమందికి తెలియకపోయినా ఆ మాట పత్రికాపాఠకులందరికీ తెలుసు.</p>
<p>ద్రవ్యోల్బణం అంటే ద్రవ్యం విలువ తగ్గిపోవడం. మరో మాటల్లో ద్రవ్యరూపంలో సరుకుల విలువలు పెరిగిపోవడం. ద్రవ్యోల్బణం రేటు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంత తగ్గింది, లేదా ఎంత పెరిగింది అని ప్రభుత్వం ప్రతివారం ప్రకటిస్తుంటుంది. మార్చ్ 2008లో 7.4 శాతం ద్రవ్యోల్బణం నమోదయిందని, 2004 నవంబర్ తర్వాత ఇది అతి హెచ్చు స్థాయి అనీ ప్రభుత్వం ప్రకటించింది. ఆహారపదార్థాల ధరలు, లోహాల ధరలు, చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఇంతగా పెరిగిందని అంటున్నారు. ఈ పెరుగుదలను అరికట్టడానికి తక్షణ చర్యలుగా ప్రభుత్వం కొన్ని సరుకుల ఎగుమతులపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. కొన్ని సరుకుల దిగుమతులపై సుంకాలను తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు ఐదు శాతాన్ని మించడం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ భావిస్తుంది. కాని దాదాపు రెండు సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం రేటు ఆరు శాతం దాటి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం ప్రకటిస్తున్న 7.4 శాతానికి చేరింది.</p>
<p>నిజానికి మనదేశంలో ద్రవ్యోల్బణాన్ని గణించే పద్ధతే చాల లోపభూయిష్టమైనది. ద్రవ్యోల్బణాన్ని అమెరికా, గ్రేట్ బ్రిటన్, చైనా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, సింగపూర్ వంటి దేశాలలో వినియోగదారుల ధరల సూచి (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ – సిపిఐ) ఆధారంగా గణిస్తూ ఉండగా, మనదేశంలో మాత్రం టోకు ధరలసూచి (హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ – డబ్ల్యుపిఐ) ఆధారంగా గణిస్తున్నారు. ఎప్పుడైనా ధరలు వినియోగదారులమీద, ప్రజలమీద ఎటువంటి భారంవేస్తాయో చూడాలి గనుక ధరల పెరుగుదలను అట్టడుగు స్థాయిలోని వినియోగదారులు వాడే సరుకుల ధరల సూచిలో మార్పుల ఆధారంగానే లెక్కించాలి. మనదేశంలో వినియోగదారుల ధరల సూచిని నాలుగు స్థాయిలలో – పారిశ్రామిక కార్మికులు, పట్టణ శారీరకేతర శ్రామికులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ శ్రామికులు – గణించడమైతే ఉంది గాని ఆ సూచిని మాత్రం ద్రవ్యోల్బణాన్ని లెక్కపెట్టే వనరుగా తీసుకోరు. అంతేకాదు, ఈ వినియోగదారుల ధరలసూచిని నెలకొకసారి గణిస్తారు. ఎప్పుడో రెండుసంవత్సరాల తర్వాత ప్రకటిస్తారు.<br />
ఇక టోకుధరల సూచి అనేది మనదేశంలో ఎప్పుడో 1902 లో లెక్కపెట్టడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మొత్తం 430 పైచిలుకు సరుకుల టోకుధరల ఆధారంగా ఈ సూచి తయారవుతుంది. ఈ వందలాది సరుకులలో వాడకంలో ఉన్నవీ ఉన్నాయి, ఎప్పుడో కనుమరుగయినవీ ఉన్నాయి. ప్రధానంగా ఈ సూచి వ్యాపారవేత్తలకు తమ ఉత్పత్తుల ముడిసరుకుల ధరల విషయంలో ఉపయోగపడేదే తప్ప వినియోగదారులకు ఉపయోగపడేది కాదు. ఈ సూచిని మాత్రం ప్రతివారం లెక్కించి దాని ఆధారంగానే ద్రవ్యోల్బణాన్ని అంచనా కట్టడం జరుగుతోంది.</p>
<p>అంతకన్న పెద్ద అర్థశాస్త్ర పాఠం అక్కరలేదుగాని, ‘ధరలు పెరుగుతున్నాయి, ప్రజాజీవనం దుర్భరంగా మారుతోంది’ అని మామూలు మాటల్లో చెప్పవలసినదాన్ని ద్రవ్యోల్బణం అనే తిలకాష్టమహిషబంధనంగా తయారు చేసి, అందులోనూ అపసవ్యపు గణాంకాలను జోడించి ప్రజలను మాయ చేయడం జరుగుతోందని మాత్రం గుర్తించవలసి ఉంది.</p>
<p>ఇలా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని వార్తలు రాగానే విభిన్న రాజకీయ పక్షాల స్పందన ఆశ్చర్యకరంగా ఉంది. ప్రజాజీవనంలో భాగంగా ఉండి తామే మొదట గుర్తించి ఆందోళన జరపవలసిన రాజకీయపక్షాలు రిజర్వ్ బ్యాంకో, ఆర్థికమంత్రిత్వశాఖో ప్రకటించినతర్వాతనే ఆ సమస్య తమకు అప్పుడే తెలిసినట్టుగా ఇల్లెక్కి అరవడం మొదలుపెట్టాయి. ఈ ద్రవ్యోల్బణం కొత్త ఏమీ కాదని, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నదేనని, చైనాలోనయితే గత పన్నెండుసంవత్సరాలలో ఎన్నడూ లేనంత హెచ్చు స్థాయిలో ద్రవ్యోల్బణం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ తేల్చేసింది. ఫలానా తేదీలోగా ధరలు తగ్గించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని వామపక్షాలు అంటున్నాయి. ధరల పెరుగుదలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయిందో వివరిస్తూ శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతాపార్టీ కోరుతోంది. బహుళజాతిసంస్థలకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వల్లనే ధరలు పెరుగుతున్నాయని తెలుగుదేశం ప్రకటించింది.</p>
<p>ఈ వ్యాఖ్యానాలలో కొంత నిజమూ ఉంది, కొంత అబద్ధమూ ఉంది. ధరల పెరుగుదల గురించి గత ఐదారు నెలలుగా ప్రపంచదేశాలన్నీ గగ్గోలు ఎత్తుతున్న మాటనిజమే. దాదాపు ప్రతిదేశం లోనూ ఈ సమస్య గురించి  చర్చ జరుగుతోంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆకలిదాడులు, లూటీలు, అశాంతి, రాజకీయ కల్లోలాలు జరుగుతాయని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ, ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు వంటి ద్రవ్యసంస్థలు, అంతర్జాతీయ పత్రికలు హెచ్చరిస్తున్నాయి. జింబాబ్వేలో అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుదల 10,000 శాతంగా ఉందని పత్రికలు రాస్తున్నాయి. హైతీలో ధరల పెరుగుదల ఎంత విపరీతంగా ఉండిందంటే బియ్యం ధరలు డిసెంబర్ 2007కూ మార్చ్ 2008కీ మధ్య మూడు నెలల్లో రెట్టింపు అయ్యాయి. ఆ ధరల పెరుగుదల వల్ల హైతీలో దేశవ్యాప్తంగానూ, ప్రత్యేకించి రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ లోనూ ఘర్షణలు, లూటీలు, గృహదహనాలు జరిగి చివరికి ప్రధానమంత్రి పదవినుంచి దిగిపోవలసివచ్చింది. </p>
<p>ఈ ధరలపెరుగుదలకు నైసర్గిక కారణాలకన్న ఎక్కువగా రాజకీయార్థిక విధానాల దుష్పరిణామాల కారణాలే ఉన్నాయి. ప్రపంచీకరణ విధానాలవల్ల అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలకోసం అవసరమైన పంటలే పండిస్తూ ఆహారధాన్యాల దిగుబడి తగ్గించడం, ఎగుమతి-దిగుమతుల విధానాలను సడలించడం, సంక్షేమరాజ్య భావనలకు తిలోదకాలు వదిలి ప్రజల ఆహారభద్రతకు గండి కొట్టడం,నిత్యావసర సరుకులలో ప్రజాపంపిణీ వ్యవస్థలను ధ్వంసం చేయడం, చిల్లర వ్యాపారంలోకి విదేశీ బహుళజాతి సంస్థలను ఆహ్వానించి నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణలను సడలించడం, ధరలస్థిరీకరణ విధానాలను వదిలివెయ్యడం వంటి అనేక కారణాలవల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. </p>
<p>ధరలు అలా పెరిగిపెరిగి చివరికి ఏమి జరుగుతుందో హైతీ సాంఘిక, రాజకీయ పరిణామాలు చూపుతున్నాయి. దేశదేశాల సంపన్నులకు, బహుళజాతిసంస్థలకు, ప్రపంచీకరణ శక్తులకు ఊడిగం చేస్తూ ఆ క్రమంలో తమ బొక్కసాలు నింపుకోవడంలో మైమరిచిపోతున్న భారత పాలకులు తమ గద్దెలు కూలిపోయే పరిణామాలనైనా గుర్తిస్తారా?</p>
]]></content:encoded>
</item>
<item>
<title><![CDATA[బియ్యం పథకం ఔదార్యం కాదు, అనివార్యం]]></title>
<link>http://kadalitaraga.wordpress.com/?p=107</link>
<pubDate>Thu, 10 Apr 2008 00:05:46 +0000</pubDate>
<dc:creator>ఎన్.వేణుగోపాల్</dc:creator>
<guid>http://kadalitaraga.wordpress.com/?p=107</guid>
<description><![CDATA[రాష్ట్రప్రభుత్వం మళ్లీ ఒకసారి రెండు ]]></description>
<content:encoded><![CDATA[<p>రాష్ట్రప్రభుత్వం మళ్లీ ఒకసారి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇరవై ఐదు సంవత్సరాల కింద కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశిస్తూ ఎన్ టి రామారావు ప్రారంభించిన ఈ పథకం అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమంది ముఖ్యమంత్రుల కింద అనేక రకాలుగా మారుతూ వచ్చి డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మళ్లీ మొదటికి వచ్చింది. <!--more-->మహా ఆర్భాటంగా, ఎన్నికల ఎత్తుగడగా, ప్రతిపక్షాల విజయావకాశాలను చెదరగొట్టే అస్త్రంగా ఉనికిలోకి వస్తున్న ఈ పథకానికి రెండు వైపుల నుంచీ అతిశయోక్తులతో కూడిన ప్రశంసలూ విమర్శలూ చెలరేగుతున్నాయి. ఎద్దుల కుమ్ములాటలో లేగదూడల కాళ్లు విరిగినట్టు ఈ అతిశయోక్తుల యుద్ధంలో వాస్తవాలు, సరయిన విశ్లేషణలు, పథకపు అవసరం, పథకాన్ని విస్తరించవలసిన అవసరం అంతర్ధానమవుతున్నాయి.</p>
<p>రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రభుత్వపక్షం చెప్పుకుంటున్నట్టు కేవలం ప్రజాసంక్షేమ దృష్టితో, పేదప్రజల ఆహారభద్రత లక్ష్యంతో సాగుతున్న పాలకపక్షపు ఔదార్యపూరిత కార్యక్రమం కాదు. పాలకులెవరయినా, ఏ జెండాలవాళ్లయినా గత ఆరు దశాబ్దాలుగా ప్రజాజీవనం పట్ల సాగిస్తున్న దుర్మార్గానికి, నిర్వాకానికి ప్రాయశ్చిత్తంగా, ప్రజలకు చేసిన నష్టాలకు పరిహారంగా అనివార్యంగా అమలు చేయవలసివస్తున్న పథకం అది.</p>
<p>ఆ పథకం ప్రతిపక్షాలు చెపుతున్నట్టు మరొకరికి అనుకరణో, ఎన్నికల ఎత్తుగడో మాత్రమే కాదు, అది ఈ రాష్ట్రపు పేదప్రజల సహజమైన హక్కు. ప్రజల శ్రమను, సంపదలను, ఉమ్మడి వనరులను దోచుకుని పాలకులు, వారి ఆశ్రితులు పోగుచేసుకున్న వేలరెట్ల, కోట్ల రూపాయల ఆస్తుల గురించి ప్రజలు నిలదీయకుండా ఉండేందుకు ఒక రక్షణకవచంగా, ఉపశమనంగా, ప్రజల హక్కుకు గుర్తింపుగా విదిలిస్తున్న ఒక చిన్నభాగం మాత్రమే.</p>
<p>అది కొంతమంది మేధావులు భావిస్తున్నట్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చే ప్రజాకర్షక (పాపులిస్టు) పథకం కాదు, ప్రజల ఇబ్బందులలో అతి స్వల్ప భాగాన్నయినా సరే తీర్చగలిగే తప్పనిసరి చర్య. అసలు ప్రజలకు అందవలసిన నిధులలో కొద్దిభాగాన్ని ప్రజలకు ఇవ్వడాన్ని పాపులిస్టు చర్యగా అభివర్ణించి వ్యతిరేకించడమే అన్యాయం.</p>
<p>ప్రభుత్వం, పాలకపక్షం తామేదో పేదప్రజల పట్ల అభిమానంతో, ప్రజాసంక్షేమం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రకటిస్తున్నాయి గాని, అసలు ఆ ప్రకటనలోనే గుర్తించదగిన లోపాలున్నాయి. ఈ పథకం కోసం సాలీనా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు తాను సబ్సిడీగా వెచ్చించవలసివస్తుందని, ఒకకోటీ ఎనభైఎనిమిది లక్షల తెల్లకార్డుల లబ్ధిదారులకు, అంటే ఆరుకోట్లమంది ప్రజలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటిస్తోంది.</p>
<p>రాష్ట్రంలో తెల్లకార్డుల సంఖ్య ఎంత? తెల్లకార్డుల సంఖ్యకూ, మొత్తం కుటుంబాల సంఖ్యకూ, రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం తెల్లకార్డు పొందడానికి అర్హత ఉన్న కుటుంబాల సంఖ్యకూ ఏమన్నా పొంతన ఉన్నదా?</p>
<p>రాష్ట్ర జనాభా ఎనిమిది కోట్ల ఇరవైరెండు లక్షలు అని, అందులో 85 శాతం ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారని, 1.88 కోట్ల తెల్లకార్డుల కుటుంబాలు లబ్ధి పొందుతాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మూడు అంకెలమధ్య పొంతన లేదు. జనాభా సంఖ్యను గనుక ప్రమాణంగా తీసుకుంటే ఆరు కోట్ల మంది అంటే 70 శాతం అవుతారు. 85 శాతం లబ్ధిదారులంటే ఏడుకోట్లమంది కావాలి!</p>
<p>ఈ అంకెలగారడీ అసలు వాస్తవమేమంటే, రాష్ట్రంలో 2001 జనగణన ప్రకారం జనాభా ఏడుకోట్ల అరవై లక్షలు కాగా, మొత్తం కుటుంబాల సంఖ్య 1,68,49,857. సాధారణంగా జనగణనలో హౌజ్ హోల్డ్ అనే ప్రమాణమే ఉంటుంది. అది స్థూలంగా ఇల్లు అని చెప్పుకోవచ్చు, సరిగ్గా కుటుంబం కాకపోవచ్చు. ఒక్కో ఇంటిలో ఒకటికన్న ఎక్కువ కుటుంబాలు ఉండవచ్చు. కాని 2001 జనగణన హౌజ్ హోల్డ్స్ కు సంబంధించి చాల వివరాలు సేకరించింది. దానిలో హౌజ్ హోల్డ్స్ సంఖ్యతో పాటు ఆ ఇళ్లలో ఉన్న వివాహిత జంటల సంఖ్యను కూడ లెక్కపెట్టింది. దానిప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,77,42,719 వివాహిత జంటలున్నాయి. అప్పటినుంచి గడిచిన ఆరు సంవత్సరాలలో మొత్తం జనాభాలో పది శాతం పెరుగుదల ఉంది గనుక కుటుంబాల సంఖ్యలో కూడ అంతే పెరుగుదల ఉందనుకుంటే మొత్తం కుటుంబాల సంఖ్య రెండు కోట్లకు దాటడానికి వీలులేదు. మరొకవైపు నుంచి చూసినా మన రాష్ట్రంలో సగటు కుటుంబ పరిమాణం 5 కన్న తక్కువే గనుక 8.22 కోట్ల జనాభాకు 1.64 కోట్ల కుటుంబాలకన్న ఎక్కువ ఉండడానికి వీలు లేదు. మొత్తంమీద ఎటునుంచి ఎటు చూసినా కుటుంబాల సంఖ్య 1.60 కోట్ల నుంచి 2 కోట్ల మధ్య మాత్రమే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 30 శాతం మాత్రమే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు గనుక తెల్లకార్డులు 55 లక్షల నుంచి 66 లక్షల కన్న ఎక్కువ ఉండడానికి వీలులేదు. మరి కేవలం తెల్లకార్డుల సంఖ్యే మొత్తం కుటుంబాల సంఖ్య కన్న ఎక్కువ ఉంది.</p>
<p>నిజానికి ఈ జనాభాకూ తెల్లకార్డుల సంఖ్యకూ మధ్య ఉన్న అంతరం గురించి 1992లోనే గుర్తించిన కె ఆర్ వేణుగోపాల్ రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య కన్న తెల్ల, గులాబీ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని ప్రకటించారు. ‘ఇండియాస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం – ఎ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్’ అని 1997లో ప్రపంచబ్యాంకు కోసం చేసిన అధ్యయనంలో ఆర్ రాధాకృష్ణ, కె సుబ్బారావు కూడ ఈ అంకెలగారడీని, బోగస్ కార్డుల సమస్యను ప్రస్తావించారు.</p>
<p>కనుక ఈ పథకం వల్ల ఎంతమందికి లాభం చేకూరుతుంది, ఎన్నికోట్లు ఖర్చు అవుతుంది అనేవన్నీ కాకిలెక్కలేతప్ప, విశ్వసనీయమైన, కచ్చితమైన సమాచారం లేదు. ఆ సంగతి గుర్తిస్తూనే, అసలు ఇటువంటి పథకం వచ్చిన సందర్భాన్ని, ఉండవలసిన అవసరాన్ని కూడ గుర్తించవలసి ఉంది.</p>
<p>విదేశీపాలన రద్దయిందని అనుకున్నతర్వాత నాలుగు దశాబ్దాలకు కూడ జనాభాలో అత్యధికులకు రోజుకు రెండుపూటల ఆహారం చౌకగా అందే పరిస్థితి లేకపోవడం, మరొకవైపు ఆహారధాన్యాల దిగుబడి జనాభా పెరుగుదల కన్న గణనీయంగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆహారభద్రత కల్పించడంలో, న్యాయమైన, సమానమైన పంపిణీని ప్రోత్సహించడంలో పాలకులు విఫలమయ్యారని గుర్తించడం ఫలితంగా 1960ల నుంచీ ఎన్నో రాజకీయార్థిక సంచలనాలు పాలకవిధానాలను ఎదిరిస్తూ వచ్చాయి. అందువల్లనే ఇందిరాగాంధీ రోటీ కపడా ఔర్ మకాన్ అనీ, భూసంస్కరణలు అనీ అనవలసి వచ్చింది. ఆ నినాదాల భ్రమలు కూడ ఒక దశాబ్దం కన్న ఎక్కువ నిలవని స్థితిలో దేశభద్రత, రక్షణ ప్రమాదం, తీవ్రవాదం అనే కొత్తబూచిలను చూపి ప్రజల కళ్లు కప్పడం మొదలయింది. ఆ దశలో రాజకీయాలలోకి ప్రవేశించిన ఎన్ టి రామారావు కొంత నిజంగానూ, కొంత పాలకవర్గ ఎత్తుగడలలో భాగంగానూ రెండురూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలులోకి తెచ్చారు.</p>
<p>ప్రజా ఆగ్రహాన్ని పక్కదారి పట్టించడానికి ఒక ఎత్తుగడగా ఇది పనికి వచ్చినప్పటికీ, ఇది ప్రజ